రమ్మీ రాక్షసికి ఐదుగురి బలి.. వీడిన తిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ

  • తిరుపతి జిల్లాలో ఐదుగురి మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
  • ఆన్‌లైన్ రమ్మీ వ్యసనంతో అప్పులపాలై ఈ ఘాతుకానికి పాల్పడిన మోహన్
  • తొలుత తల్లి, భార్యను ఇంట్లో హత్య చేసిన నిందితుడు
  • తండ్రిని కాపాడే ప్రయత్నంలో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పిల్లలు
  • రైల్వే ఉద్యోగం వచ్చినా వదిలేసి, భార్య సంపాదనపై ఆధారపడిన మోహన్
తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి కేసు మిస్టరీ వీడింది. ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం, అప్పుల భారం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇంటి యజమాని మోహన్ తన కన్నతల్లి, భార్యను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ బుధవారం తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం స్కూల్‌కు వెళ్లి, మావయ్య చనిపోయాడని అబద్ధం చెప్పి తన ఇద్దరు పిల్లలు కౌశిక్‌ (14), హరిణి (12)లను ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలను ఇంట్లోకి వెళ్లనీయకుండా బయట నుంచి స్కూటీపై ఆ ప్రాంతంలో తిప్పి, చివరికి రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మోహన్ వేగంగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలిద్దరూ రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆన్‌లైన్ రమ్మీతో అప్పుల ఊబి
మోహన్ కొంతకాలంగా ఆన్‌లైన్ రమ్మీకి బానిసై, రూ.40 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఉన్న ఆస్తులు, బంగారం అమ్మి అప్పులు తీర్చినా, ఇంకా అప్పుల ఊబిలోనే కూరుకుపోయాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన మరణానంతరం వచ్చిన ఉద్యోగాన్ని కూడా మోహన్ వదిలేశాడు. అతని భార్య హరిత బ్యూటీపార్లర్, టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల చీటీ డబ్బులతో భర్తకు ఒక సిమెంట్ షాపు కూడా పెట్టించింది. అయినా మోహన్ తన వ్యసనాన్ని వీడలేక మొత్తం కుటుంబాన్ని బలితీసుకున్నాడు. గురువారం ఐదు మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tirupati Family Suicide
Mohan
Online Rummy
Tirupati
Debt Trap
Andhra Pradesh
Murder Suicide
Venkatakrishna Palem
Financial Crisis
Children Killed

More Telugu News